ఈ రోజు పోలాల అమావాస్య.పూజ చేసుకున్న ప్రతి సంవత్సరం ఆమ్మ పంపిన ఈ ఉత్తరం తీయడం చదువుకొని పూజ చేసుకోవడం.దాన్ని జాగర్తచేసుకోవడం. ఇంతవరకు ఏ పుస్తకంలో ను వ్రాయలేదు. అంత బద్దకం.కాని ఒకటి తీసి చదివినప్పుడల్లా అనందమేను.అప్పట్లొ అందరి యోగక్షేమాలు తెలుసుకునే ఆసక్తి వుండేది. ఆ అభిమానం ఆప్యాయత అలా ఉండేది.. ఇప్పుడు నేను నా పిల్లలు నా సంసారం, ఏమిటొ ఇలా మారిపోయాను.
ఈ ఉత్తరంలో అందరి కుశలము, పూజ ఎలా చేసుకోవాలో , కధ, అన్ని వ్రాసి 6-8-1974పోస్టు చేసిన ఉత్తరం.ప్రస్తుతం మా పిల్లలకు చాలాబంధుత్వాలే తెలీదు,చుట్టాలు మాట దేముడేరుగు, పక్క ఫ్లాటులో ఎవరుండేది కూడా తెలీదు.
పోలాల అమావాశ్య 17-8-74 తేది,శనివారమునాడు అయినది, దొరికితే కందమొక్కలు 2కాని 3 కాని పెట్టుకొని పూజ చేసుకొనవలెను. పసుపు కొమ్ములు పసుపు దారము 9 పోచలు వేసి మూడు కట్టి ఒకటి అమ్మవారికి ఒకటి నీవు ఒకటి పిల్లకు మెడలొ కట్టుకొనవలెను,9గారెలునైవేధ్యము , 9గారెలు వాయనము ఇవ్వవలెను, 7 చొ"న కూడా చేయవచ్చును, మొక్కదొరకనిపక్షములొ పోలేరమ్మ దేవత అని సంకల్పము చేసుకొని పూజ చేయవలెను, ముత్తయిదువు దొరకనిచో అమ్మవారికే వాయనమిచ్చి మీరె తినవచ్చును .మొక్కపెట్టు స్తలము అలికి పద్మములు పెట్టిపూజచేయవలెను. దీనిలో వెనుక కధ ఉన్నది, ఆ కధచెప్పుకొని అక్షింతలు అమ్మవారికి వేసి నీవు వేసుకొని పిల్లకు వేయవలెను. పిల్ల ఆరోగ్యం జాగర్త. విసుక్కోకు,బాబు అల్లరి చేస్తూంటే పూనా పంపేయమనిచెబుతోది అరుణ, అందుచే మామయ్య పూనా వచ్చేస్తూన్నాడని రేణుకుచెప్పు. ఇంక విశేషాలు లేవు, వెంటనే ఉత్తరం వ్రాయి, నోము అన్ని వారాలు చేసుకున్నావా?-------
అమ్మ ఉత్తరం
నా మనస్సులో మాట
మార్పు అనేది మానవ సహజం.మారాలి కూడాను.ఆ మార్పు వచ్చినపుడు ఆనందంగా స్వాగతం పలకాలి. నేను మారను. ఇది వరకు ఎలా వుందో అల్లాగే వుండాలి. నా చిన్నపుడు ఇలాగే వుండేది ఇప్పుడు అలాగే వుండాలి ఆంటే కుదురుతుందా చెప్పండి.ప్రకృతి సహజంగానే కాలాల్ని మారుస్తుంది. దానికి అనుగుణంగా మనకి మారె సహజగుణం నేర్పుతుంది.మొన్న మేము పొరుగూరికి వెళ్ళివచ్చాము. అక్కడ కొంతమంది మా చెలెల్లు గారింట్లొ చదువులు , పిల్లలు వారి అబిరుచులు ఏవో మాట్లాడుకున్నారు, నాకు తోచినది చెప్పాలనుకున్నా చెప్పలేదు. కొత్తవారుకదా ఏమనుకుంటారోననిపించింది. కాని వారి మాటలని విన్నతరువాత నాకు తోచినది.--- కొందరు తల్లితండ్రులు వాళ్ళపిల్లలని బలవంతంగా యిష్టంలేని చదువులు చదివిస్తారు.పిల్లలకు ఏ కోర్సు మీద అభిరుచి వుందీ? వాళ్లు ఎందులో రాణించగలరు?ఏమీ ఆలోచించరు, వాళ్లకి యిష్టమయినదే చదివిస్తారు,యిది చదివితేనే బాగుంటుంది. మంచి ఉద్యోగంవస్తుంది అలాగా వివరంగా చెబితె పరవాలేదు,బలవంతంగా వీళ్ళమీద రుద్దడం మాత్రం మంచిదికాదు.పిల్లలకు వాళ్ల కెపాసిటి తెలుసును. వాళ్ళు ఏది చదవాలి ఎందులో వాళ్ళు బాగా పైకి రాగలరు? కాని పెద్దలకి చెప్పాలంటే భయం.ఒకవేళ చెప్పినా పేరెంట్స్ వినరు. వాళ్ళు చెప్పినదే చేయాలంటారు. ఫలితం సరిగ్గా మార్కులు రాకపోవడం, ఫ్రస్ట్రేషను,డిప్రెషను. తల్లితండ్రులు ఈ తరం పిల్లల్ని అర్ధంచేసుకోవాలి,వాళ్ల అభిరుచులు తెలుసుకోవాలి, వాళ్ల అభిప్రాయాల్ని గౌరవించాలి,వాళ్ల యిష్టా అయిష్టాలని తెలుసుకోవాలి, పిల్లలకోసం యింత సంపాదిస్తున్నాం ,యింత సేవ్ చేస్తూన్నాం,అని కాకుండా యింత సమయం పిల్లలతో గడిపాము, వారి మనసులోమాట తెలుసుకున్నాం,మా యిద్దరి మద్య మంచి వారధి నిర్మించుకున్నాం,అనేలా వుండాలి, వాళ్ళకి ఏం తెలుసులే అని కాకుండా వారి వ్యక్తిత్వానికి వారి మాటకి ప్రాధాన్యత యిచ్చి వారి మాటవిని చెప్పె అవకాశం యిచ్చి,స్నేహంగా, సన్నిహితంగా మెలగాలి.పిల్లలతో ఇండొర్ గేమ్స్ ఆడి ,స్క్రాబిల్ ఆడి పదవిజ్ఞాన్నాన్ని పెంచి, బిజినెస్ ఆట తొ వారి వ్యాపార దక్షత వ్యవహారతీరు గమనించచ్చును, చదరంగం ఆటతో యుక్తులు వారి షార్పునెస్ పెంచె ప్రయత్నం చేసి వారికి దగ్గరగావుంటూ,వారి ఇంటరెస్ట్ తెలుసుకోవచ్చును,చిన్న చిన్న కధలతో ఆటలతో మంచి ఏదో చెడు ఏదొ తెలియబరచి, ముఖ్యంగా చెప్పకండి, చేసి చూపించండి, చెప్పె నీతులకన్నా మన ఆచరణేముఖ్యం. మనం చేసె పనులు ,అలవాట్లు, మంచిగా వుంటె అవే నేర్చుకుంటారు.అనుకరణ మానవ సహజం. మనం మంచిగావుంటే అంటే చేసే వృత్తి నమ్మకంగా వుండటం ,సామాజిక, నైతికవిషయాలలో,అలవాటులలో,ప్రవర్తనలో,మన నడవడిక,మనమాట,పెద్దలకి మనం యిచ్చె గౌరవం, ఎంత ప్రాధాన్యత యిస్తూన్నమన్నది,చెప్పెవికావు, మనం ఆచరిస్తే, తరువాత తరానికి అభ్యాసం అలవాటు అవుతాయి. రేపటి అభ్యుదయానికి పునాది అవుతుంది. ఇంజనీరింగు, డాక్టరీ కోర్సులే కాకుండా,ఇంకా చాలా చాలా మంచి చదువులే వున్నాయి. ఈ కోర్సు నాకు నచ్చింది యిది చేస్తాను, అనే పుత్రరత్నాని ప్రోత్సాహించి సపోర్టు చేయండి. నేను ఇంక చదవలేను నా వల్లకాదు అంటె సమర్దించి తన కాళ్ళమీద తాను నిలబడకలిగే స్వయంఉపాధి పధకాల సహాయంతొ తనకు తాను నిలదొక్కుకునేందుకు సాయపడండి. మనసు విప్పి మాట్లాడే అవకాశం వుండేటట్లు చూసుకోవాలి.( వాళ్ళ పిల్లలు యింత బాగా చదువుతారు, మనల్ని చూసి నవ్వుతారేమో అలాంటి ఆలోచన రానీయకూడదు)పిల్లల దగ్గరనుండి మనకి కావలసినది గౌరవంకంటే ఆత్మీయత(అపనాపన్). మననుండి పిల్లలకు మమకారం మీకు మేము వున్నామనే భరోసా. మార్పు వచ్చింది కానీ,కొన్నిచోట్ల ఇంకా రాలెదు.పెద్దవాళ్ళ మూర్ఖత్వం, పిల్లల మొండితనం చూసిన తరువాత రాసిన సంగతండి ఇది. ఈ మధ్యన తల్లితండ్రుల ఒత్తిడి తట్టుకోలేక, విధ్యార్ధుల ఆత్మహత్యలు నివారించే బాధ్యత మనమీదే ఉందికదా !!
చిన్నపిల్లలు వాళ్లకి ఏం తెలుసండి? మాతల్లితండ్రులు మమ్మల్ని పెద్ద చదువులు చదివించలేకపోయారు,పెద్దకుటుంబం . మేము అలాగాకాదు, మాకున్నది ఒక్కడే,వీడిని అన్నిసౌకర్యాలతో , దర్జాగా చదివిస్తాముమంచి స్కూలు, పేరుపొందిన సంస్థలో కోచింగు,అసలు అందుకోసమేగా మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నది.కష్టపడుతున్నది?-- తల్లితండ్రుల మాట.