RSS

చంద్రకాంతలు

   ఆధునిక సదుపాయాలయిన గ్యాస్ స్టౌ, మిక్సిలు, లేని అరోజుల్లో అంత శ్రమ పడి , కమ్మగా చేసిన అమ్మ చేసిన పిండివంటలు ఇప్పటికి గుర్తుచేసుకుంటున్నారంటే ఆ వంటల్లోని రుచికంటె, -- అనురాగం, ప్రేమ, మమత రంగరించి అందించిన "ఆమ్మ". అంతే! అదే భావనతో కూడిన అణకువ, ఆప్యాయత తో అందుకున్న పిల్లలున్నంతవరకూ పాత పిండివంటలు ఇంకా అక్కడక్క్డడ ఘుమఘుమలాడూతూనేవుంటాయి. అలాంటివే " చంద్రకాంత"లు.

   కావలసినవి పెసరపప్పు---- 1 గ్లాసు లేక 1 కప్పు పంచదార----- 1 గ్లాసు లేక 1 కప్పు పచ్చికొబ్బరి---- 1 చెక్క ( తురుము కోవాలి) నెయ్యి ------- వేయించేందుకు జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి, ఇష్టమైతే కొద్దిగా పచ్చ కర్పూరం.

   1. ఓ గంటసేపు నానబెట్టిన పెసరపప్పుని కడిగి నీరు పోయకుండా ' మిక్సి' లో మెత్తగా రుబ్బుకోవాలి.( పెసరట్లకి రుబ్బుకున్నట్లుగా)

   2. పచ్చికొబ్బరి తురుము, పంచదార, పెసరపిండిలో కలిపి ( బాణలి కాని, దళసరి పాత్రలో కాని) " స్టౌ" మీదపెట్టి ఆడుగంటకుండా హల్వాకి కలిపినట్లుగా కలుపుతూ వుండాలి. ఓ పదిహేను నిమిషాలకి ముద్దలా అవుతుంది.దానిలో జీడిపప్పు, ఏలకులపొడి, కర్పూరం కలిపి ,"స్టౌ" కట్టేసి ఓ నిమిషం అలాగే వుంచాలి.

   3. తెల్లటి శుభ్రమైన కొంచెం దళసరి బట్ట ని తడిపి దాన్ని ఓ పీట మీదో చెక్క మీదో పరచి , దాని మీద పెసరపిండిమిశ్రమాన్ని వేసి జాగ్రత్తగా ఒత్తుకోవాలి. తడి రుమాలుతో ఒత్తుకుంటే చెయ్యి కాలకుండా వుంటుంది. మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఒత్తుకొని, చల్లారిన తరవాత మనకి కావలసిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి.( డైమండ్సుగా, లేక గుండ్రంగా)

   4. బాణలిలో నెయ్యి వేసి ( ఇంచిమించుగా పప్పు ఎంత వేస్తామొ నెయ్యి అంత పడుతుంది),మరిగాక, కోసిన ముక్కలు వేయించుకోవాలి.జాగర్తగా బంగారం రంగు లోకి రాగానే తీసేయాలి. అంతే!

    అప్పుడప్పుడు ఇలాంటి పాతపిండివంటలు చేసి ఈ తరం వారికి రుచి చూపిస్తే బాగుంటుంది కదూ!!!

ఎరక్కపోయి ఉండమన్నాను ఇంట్లో...

    మా శ్రీవారు నామీద "అలిగినప్పుడు", ఇంట్లో ఉన్న తెలుగు పత్రికలు చదివేస్తూ ఉంటారు. నా అదృష్టం బాగోపోతే,తను చదివినదేదో మహ బాగా నచ్చేస్తూంటుంది. ఆ ప్రకరణం లో భాగంగా, నిన్న వచ్చిన "స్వాతి" పత్రిక లో వస్తున్న వంశీ గారి " రంగులరాట్నం" సీరియల్, జరిగిన కథ చదివేసి, అప్ డేట్ చేసెసికున్నారు. ఒక్కసారి ఆ కథలో ఆయన వ్రాస్తున్న, రాజోలు, మల్కిపురం, జగ్గంపేట, మానేపల్లి, పెదపట్నం పేర్లు చూసేసరికి, నామీదున్న అలక కూడా పోయింది. ఆ ఊళ్ళన్నీ తిరిగారుగా చిన్నప్పుడు, దానితో ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. అబ్బ ఎంత బాగా రాస్తున్నారోయ్, పాప జ్ఞాపకాలన్నీ గురొచ్చేస్తున్నాయి అన్నారు. ఏదో పాత జ్ఞాపకాలతో సరిపోతే బాగానే ఉండేది. కానీ ఆయనకి ఆరోజుల్లో వాళ్ళ అమ్మగారు చేసినవేవో గుర్తొచ్చేస్తూంటాయి. అక్కడే వస్తుంది అసలు గొడవంతా..

   ఇదివరకెప్పుడో చేసేదాన్ని, "చంద్రకాంతాలు" అని ఓ పిండివంట. దానికి ఓ కొబ్బరికాయ కూడా ఉండాలిలెండి. ప్రతీ శనివారం కొబ్బరి కాయ కొడుతూంటారు. కానీ ఎప్పుడూ కొబ్బరి రైస్సూ, లేకపోతే శనివారం ఫలహారాలకి పచ్చడి చేయడానికే సరిపోయేది.అప్పుడప్పుడు అడిగేవారులెండి, ఓసారి మళ్ళీ చంద్రకాంతాలు చెయ్యకూడదోయ్ అంటూ. చెప్పానుగా ప్రతీ రోజూ బ్రేక్ ఫాస్ట్ తినేసి, ఏదో వంక పెట్టేసి, మనవణ్ణి చూడ్డానికి పారిపోతూండేవారు. For a change.. ఈవేళ ఏమీ పనిలేదూ, ఇంట్లోనే ఉంటానూ అని ఇంటిపట్టునే ఉండిపోయారు. తెలుగు వారపత్రికలు నిన్ననే తెచ్చేశారులెండి. పైగా వాటిలో "దాపరికం" ఓటీ. తెచ్చినప్పుడు చెప్పొచ్చుగా, అవి నేనెక్కడ చదివేస్తాననో తలగడ కింద పెట్టుంచారు. ఏం లేదూ, శనివారాలు తెచ్చే పత్రికలు ఓ రొజుముందే తెస్తే, వాటిని చదివేసి " చదవడానికి ఏమీ లేదండీ." అని అంటానేమో అని భయంట ! ఇంక న్యూస్ పేపర్లైతే కొనడమే మానేశారు. ఆ మధ్యన ఓ టపా కూడా వ్రాశారు.

    ఈ శనివారం హాయిగా అలవాటు ప్రకారం ఆయన్ని బయటకు వెళ్ళనిచ్చినా బావుండేది. అనవసరంగా నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. నిన్న తెచ్చిన "స్వాతి" లో శ్రీ వంశీ గారి రంగులరాట్నం లో ఆయన ప్రస్తావించిన " మొక్కా మొక్కా మొలిచిందంటా ఏం మొక్కా మొలిసిందంటా రాజుగారి దొడ్డిలోనూ జాం మొక్కా మొలిసిందంటా... అమ్మా అక్కల్లారా, చంద్రగిరీ భామల్లారా, గొబ్బీయల్లో..."

   పాట చదివేసరికి, మా శ్రీవారు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. చెప్పానుగా ఆయనకి ఇలాటి వాటిల్లోకి వెళ్ళారంటే ఏదో " గొంతెమ్మ కోరికలు" వచ్చేశాయే.. పైగా ఎక్కడో ఎప్పుడో విన్న సామెతలు కూడా గుర్తొచ్చేస్తూంటాయి. "చెడిన కాపరం ఎలాగూ చెడిందీ, చంద్రకాంతలైనా చెయ్యవే భామా.."

అన్నదెప్పుడైనా విన్నావా అంటూ, వంటింట్లోకి వచ్చేశారు. ఇప్పుడు మన కాపరానికేమొచ్చిందండీ బాగానే ఉన్నాము కదా అంటే. అబ్బ అలా అని కాదోయ్, మాటవరసకన్నాను, అంటే అందులోని " చంద్రకాంతాలు" చేయమని గుర్తుచేయడం అన్న మాట! ఏం చేస్తానూ తప్పుతుందా. ఇదిగో దాని ఫలితమే పైన పెట్టిన ఫొటో. చూడ్డానికే కాదు, తిండానికి కూడా బాగానే ఉందోయ్ అన్న ఒక్క మాట చాలదా మరి, సంతోషించడానికి...

ఓ చిన్న సందేశం.. ఓ చిన్న పలకరింపు...

   " ఏమండీ... ఓ చిన్న మాట.. కింద మెట్లదగ్గర, ఒక సిమెంటు కలర్ హాఫ్ స్వెట్టరులో, తలకి మఫ్లర్ చుట్టుకుని, ఒకాయన కనిపిస్తే చెప్పండి, నేనూ, పాప బాగానే ఉన్నామూ.., పాప ఏడవడం లేదూ , ఫలానా కొండ మీద ఉన్నామూ..." అని ప్లీజ్ చెప్తారు కదూ... అంటూ, కొండ దిగేవారితో, ఓ "చిరుసందేశం". అలాగే, పైకి వస్తున్నవారు ఓ చిన్న మాట, " కింద ఓ స్వెట్టరు, వేసికుని, మఫ్లర్ చుట్టుకున్నాయన్ని చూశాము,ఆయన మెల్లిగా మెట్లు ఎక్కుతున్నాననీ, మమ్మల్ని జాగ్రత్తగా ఉండమనీ..చెప్పారు.." అంటూ ఓ మేఘసందేశమూ.. ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా? తిరుమల కొండ మెట్ల మార్గం ద్వారా, 1974 లో, మా అమ్మాయి అన్నప్రాశనకి ఆ శ్రీవెంకటేశ్వరుడి దర్శన నిమిత్తం వెళ్తూ...మరి ఆరోజుల్లో సెల్ ఫోన్లూ, ఎస్.ఎం.ఎస్ లూ లేవుగా, ఓ " చిన్న మాట.. ఓ చిరుపలకరింపే.. " దిక్కు.

    మనవరాలి అన్నప్రాశనకి, మామగారు ఓ ముహూర్తం ఫిక్స్ చేసి ఉత్తరం వ్రాసేశారు. ఆ రోజు ఉదయం 10.20 కి పాపకి "పుట్టువెంట్రుకలు" తీయించి, స్వామివారి ప్రసాదం ముట్టించడం కార్యక్రమం. మా వారికేమో, మెట్లమీదుగానే వెళ్ళాలీ అని. పోనీ ఈరోజుల్లోలాగ మన లగేజీ, టిటిడి వారే పైకి అందచేసే సదుపాయం ఉందా అంటే అదీ లేదూ. ఓ మనిషిని పెట్టుకుని, మన లగేజీ పైకి తీసికెళ్ళడం. పోనీ ఆ లగేజీ అయినా, తేలిగ్గా ఉంటుందా అంటే అదీ లేదూ, నా పెళ్ళై నాతో తెచ్చుకున్నof all things.. ట్రంకు పెట్టి !! దానికి మూడు తాళాలూ. పాపకి దారిలో అవసరం అయితే పట్టడానికి పాలూ నీళ్ళూ, వీటిని పెట్టుకోడానికి ఓ ప్లాస్టిక్ బుట్ట ! వెర్రితల్లి, అన్నప్రాశన అయేదాకా పాలూ,నీళ్ళూ తప్ప ఇంకోటి ఇచ్చేవాళ్ళం కాదు. అసలు ఇప్పుడు తలుచుకుంటే నవ్వాలో, ఏడవాలో కూడా తెలియదు! ఏమిటో పెద్దవారు చెప్పారూ, మనం విని తీరాలీ అనే కానీ, అయ్యో పాలూ నీళ్ళతో ఆ బుల్లికడుపు నిండుతుందా అనే ఆలోచనే ఉండేది కాదు!

    ప్రయాణం లోనే ఆయనకి కొద్దిగా నలతగా ఉండి, అలిపిరిలో మా ఫ్రెండు ఇంటికి చేరేటప్పటికే 104 డిగ్రీలు జ్వరం.పోనీ అలాగని ఏ బస్సులోనో వెళ్దామా అంటే వినరూ. ఆయనకి ఆ స్వామి అంటే అంత నమ్మకమూ భక్తీనూ. ఏం పరవాలేదు, ఆయనే చూసుకుంటారు అని ఓ విశ్వాసం. ఆయన నమ్మకాన్నీ కాదనలేముగా, అన్ని కొండలూ ఈడ్చుకుంటూ , అంత జ్వరంలోనూ ఎక్కలేదూ? నాదారిన నేనూ, ఓ చేత్తో ప్లాస్టిక్ బుట్టా, చంకలో పాపా, పక్కనే సామాన్లు మోస్తూ ఒక మనిషీ. ఇంతలో ఒకతను వచ్చి పరిచయం చేసికుని, కింది కొండమీద మెట్లమీద ఒకాయన స్వెట్టరూ, మఫ్లరుతో కనిపించారండి, తను జాగ్రత్తగానే ఎక్కుతున్నాననీ, మమ్మల్నీ మెల్లిగా ఎక్కమని చెప్పారనీ అన్నారు. తను ఏదో సినిమా కంపెనీలో పనిచేస్తున్నట్టు పరిచయం చేసికుంటూ, పాపని ఎత్తుకుంటానూ ఇలా ఇవ్వండీ అన్నారు. అమ్మో పాపనివ్వడమా ఏ పరిచయమూ లేనివారికీ! ఫరవాలేదులెండి అంటూనే మొత్తానికి కొండపైకి చేరాము. ఇంకా ఆయన అతా పతా లేదు !మాతో వచ్చినాయన, నాకు ఓ కాటేజీ ఇప్పించి,సామాను లోపల పెట్టించి, త్రాగడానికి ఓ కాఫీ కూడా తెప్పించి, వెళ్ళిపోయారు. తిరిగి ఓ రెండు గంటల తరువాత, మా వారిని కాటేజీకి తీసుకొచ్చి, నాకు అప్పగించి మరీ వెళ్ళారు! ఇలాటి వ్యక్తినా అనుమానించానూ అని ఎంతో బాధపడ్డాను. ఆయనకి ధన్యవాదాలైనా తెలుపుకుందామని చూస్తే, ఇంకెక్కడ ఆయన ? పుణ్య క్షేత్రాల్లో ఇలాటివి జరిగినప్పుడు, భగవంతుడి మీద భక్తీ, విశ్వాసమూ ఇంకా పెరిగిపోతుంది. ఇందులో నష్టమేమీ లేదుగా..

.

    పాప తలనీలాలు తీయించి, స్నానం, పానం చేసి, తెమిలి, క్యూ కాంప్లెక్స్ కి వెళ్తే, అక్కడ మమ్మల్ని మూడో కంపార్టుమెంటులో కూర్చోపెట్టారు. ముహూర్తం టైముకి, పాపకి స్వామివారి ప్రసాదం పెట్టగలనా, అన్నీ సవ్యంగా జరుపు తండ్రీ అంటూ ప్రార్ధించడం తప్ప ఇంకో ధ్యాసే లేదు. మా పక్కనే ఒక మార్వాడీ కుటుంబం కూర్చున్నారు, నాకు తెలిసిన తూఠీ పూఠీ హిందీలో వారిని పలకరించాను. మా శ్రీవారేమో, కొత్త పరిచయాలు చేసికోడంలో ఎప్పుడూ ముందేగా,ఆ కుటుంబ పెద్దతో కబుర్లు మొదలెట్టారు. ఏమయిందో ఏమో, ఆయన గేటు దాకా వెళ్ళి సెక్యూరిటీ వారితో, ఏదో మాట్టాడారు. వారు స్పెషల్ దర్శనానికి టిక్కెట్టు తీసికున్నారుట, ఇక్కడ క్యూలో నుంచునే అవసరం లేదని తెలిసికుని, బయటకు వెళ్ళే ప్రయత్నం లో, ఒకాయన వెనక్కి వచ్చి, " పిల్లలకి టిక్కెట్టుండదుట, కావలిస్తే మీరిద్దరూ మాతో రావచ్చూ, ఎలాగూ మతో ఇంకో ఇద్దరిని తీసికెళ్ళొచ్చూ..." అన్నారు. నిజంగా ఆ శ్రీవెంకటేశ్వరుడే, వీరి రూపం లో వచ్చి, మాకు అనుకున్న ముహూర్తానికి దర్శనం, ప్రసాదం ఇప్పించారనిపించింది !!

    చూశారా ఒక చిన్న పలకరింపు ఎంత ఉపయోగించిందో... కొండ ఎక్కుతూండగా ఓ చిన్న సందేశం, ఓ చిన్న మాటా... మరి ఈరోజుల్లోనో ఎవరినైనా పలకరించాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి....

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes