RSS

मै भी कभी बहू थी !

   ఈ వేళ మా అత్తగారి తిథి పెట్టడానికి రాఘవేంద్ర మఠానికి వెళ్ళాము. ఆవిడ వరసకి నాకు అమ్మమ్మకూడా అవుతారు.ఆవిడ 2007 లో 95 ఏట పోయారు.ఇప్పటికి 3 సంవత్సరాలయింది. ఏమిటో ఈవేళంతా ఆవిడగురించే ఆలోచనలు.
నా పెళ్ళై 38 ఏళ్ళయింది.అంటే నేను 35 సంవత్సరాలు కోడలుగా ఉన్నానన్నమాట!ఒక్కవిషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాల్ని, ఆవిడ నాచేతిలోనే ప్రశాంతంగా కన్నుమూశారు.ఆవిడ దగ్గరనుండి ఎన్నో నేర్చుకున్నాను, జీవితం గురించి ఆవిడలో కలిగిన మార్పులూ వగైరా. మీ అందరితోనూ పంచుకోవాలనిపించింది.

   నా పెళ్ళై వచ్చి, నాకు శ్రీమంతం చెయ్యడం, ఆవిడ షష్ఠిపూర్తీ ఒకే రోజున అయ్యాయి.అప్పటికే మా ఇంట్లో నాకు ఇద్దరు తోడికోడళ్ళు.ఇంట్లో మాశ్రీవారే ఆఖరి కొడుకు,ఈయన తరువాత ఓ అమ్మాయీ.కోడలొచ్చిన వేళన్నట్లు,నా పెళ్ళి తరువాత, మా ఆడపడుచు పెళ్ళయింది. 1975 లో మా మామగారు పోయారు.అయినా ఆవిడ అమలాపురంలో లంకంత ఇంట్లో ఒక్కరే ఉండేవారు,కొన్ని వాటాలద్దెకిచ్చేసి.మా బావగారు చాలా కాలం దగ్గరలోనే ఉద్యోగం చేస్తూండడంవల్ల,ఆయనే ఎక్కువగా అక్కడికి వెళ్తూ వస్తూ ఉండేవారు.ఇంకో బావగారేమో హైదరాబాదు లో ఉండేవారు.మాకు ఏడాదికో రెండేళ్ళకో అక్కడికి వెళ్ళే వీలవుతూండేది.ఎప్పుడో చూడాలనిపించినప్పుడు, పూనా మా దగ్గరకి వస్తూండేవారు.మేము పిల్లలతో అమలాపురం వెళ్ళినప్పుడు మాత్రం,నన్ను పూచిక పుల్ల ముట్టుకోనిచ్చేవారుకాదు.వంటా వార్పూ ఆవిడే. "ఏం చేస్తావులెద్దూ, రోజూ పిల్లలకి చేసి అలిసిపోతూంటావు,ఇక్కడికి వచ్చినప్పుడైనా రెష్టు తీసికో" అనేవారు. ఉన్న వారంరోజులూ,ఏదో ఒకటి చేస్తూండడమే. ఎంతచెప్పినా సంవత్సరాలకొద్దీ ఇంకోళ్ళకి పెట్టిన చెయ్యి! అవతలివాళ్ళు చేస్తే మడీ,ఆచారం కుదరదు,అలాగని మరీ నన్ను మడికట్టుకుని చేయమని అడగడం ఎందుకూ అని! ఏదిఏమైనా నాకు అమలాపురం వెళ్తే మాత్రం హాయిగా ఉండేది.

   మాకు వరంగాం ట్రాన్స్ఫర్ అయిన తరువాత, ఓ మూడు నెలలకి అక్కడికి వచ్చారు. అంతకుముందు, పూనా వచ్చినప్పుడల్లా, ఆవిడ మా అమ్మేమో అనుకునేవారు,పక్కవాళ్ళంతా!వరంగాం వచ్చేటప్పటికి, ముందుగానే చెప్పేశారు- నాకు 10.30 కి భోజనం పేట్టేయి తల్లీ, నాకు మీలాగ టిఫినీలూ వగైరా అలవాటులెవమ్మోయ్'-అని.మాకు అక్కడ క్వార్టర్ లో చుట్టూరా గార్డెనూ అదీ ఉండేది. దాంట్లో తులసి కోటా, పువ్వులచెట్లూ అన్నీ ఉండేవి.ప్రొద్దుటే ఆరింటికల్లా నిద్ర లేవడం అలవాటేమో, కొంచెం కష్టం అయేది,ప్రొద్దుటే ఈవిడా, పిల్లల్ని స్కూలుకి తయారుచెయ్యడం, ఆయన ఫాక్టరీకి తయారవడం, ఒక్కటే బాత్ రూమ్మూ. అందరికీ ఎవరిపనులు వాళ్ళకి అయిపోవాలి,ఎవరిని కాదంటే వాళ్ళకి విసుపులూ,కోపాలూ,
మీరే ఉహించుకోండి, మా ఇల్లెలా ఉండేదో!ఇంత హడావిడిలోనూ ఆవిడ స్నానం చేసేసి, తులసికోట దగ్గరకు వెళ్ళడం,దానిచుట్టూ ప్రదక్షిణలూ,బయట స్కూళ్ళకెళ్ళే పిల్లలకి తమాషాగా ఉండేది.పిల్లలు స్కూలుకీ,ఆయన డ్యూటీ కీ వెళ్ళగానే,కాఫీ త్రాగేసి,మళ్ళీ గార్డెన్లో చక్కర్లూ!ఇవన్నీ అయ్యేసరికి పదిన్నరా అయ్యేది.అప్పటికి స్నానం పానం పూజా పునస్కారం పూర్తిచేసికుని, ఆవిడకి పప్పూ,కూరా,ఓ పచ్చడీ ( మళ్ళీ ఊరగాయ కాదు!), పులుసూ పెట్టి భోజనం పెట్టడం!ఓ కునుకు తీసి, మళ్ళీ ఒంటిగంటన్నరకల్లా కాఫీ పడాల్సిందే. ఈ ప్రోగ్రాం అంతా ముందే చెప్పేశారు.ఆవిడకు కావలిసినట్టుగా చెయ్యకపోతే, ఆయన బాధపడతారేమో అని,అప్పుడప్పుడు కష్టమనిపించినా,ఎప్పుడూ నాగా మాత్రం పెట్టలేదు!అందుకనే ఈవిడను చూడ్డానికి వచ్చే తెలుగువారితో ఆవిడంటూడేవారు-' మా కోడలు, లోపల ఏమనుకున్నాసరే బాధ్యతగా అన్నీ టైముకి చేసేస్తూంటుంది. భోజనం పెట్టిందీ అంటే గడియారం చూసుకోనఖ్ఖర్లేదు, పదిన్నరయిందన్నమాటే!' అనేవారు.

   ఎక్కడైనా ఎవరైనా పోయారని విన్నారో, ఇంక ఈవిడకి బెంగొచ్చేసేది, పెద్దకొడుకు దగ్గరకు వెళ్ళిపోవాలని, అంతే ఆయన్ని పట్టుకుని పీకేసేవారు!పోతే పెద్దకొడుకు చేతిలోనే పోవాలని.ఏమిటో అన్నీ అనుకున్నట్లే జరుగుతాయా? మా పెద్ద బావగారు సడెన్ గా పోవడం, ఆవిడకో పెద్ద దెబ్బ. పెద్దబావగారు లేకపోవడంతో, అమలాపురం లో ఉన్న ఇల్లు అమ్మకానికి పెట్టేశారు. అప్పుడు మాత్రం ఆవిడ చాలా బాధపడ్డారు, మామూలు టీచర్ ఉద్యోగం చేస్తూ, పదిహేను గదుల ఇల్లు కట్టించడమంటే, మా మామగారు ఎంత కష్టపడ్డారో ఆవిడ కళ్ళారా చూశారు,అయినా సరే, ఆ ఇంట్లో ఏమేం సామాన్లెక్కడెక్కడున్నాయో ఓ కాగితం మీద వ్రాసి ఉంచారు.వాటన్నిటికీ కాళ్ళొచ్చేశాయి, అది వేరే సంగతి లెండి.

    పెద్ద బావగారు పోయిన తరువాత, మాదగ్గరా, చిన్నబావగారిదగ్గరా ఉంటూండేవారు. దురదృష్టవశాత్తూ,మా చిన్న బావగారూ, ఆయనపోయిన ఏడాదిలోనే మనవడూ పోయేటప్పటికి, ఇంక ఆవిడ లో ఒక టైపు నిర్వికారం వచ్చేసింది.ప్రపంచంలో ఇంక ఇంతకంటె ఆ భగవంతుడు ఏం చెయ్యగలడూ అని.పోన్లే ఉన్న ఒక్క కొడుకు చేతిలోనన్నా పోయే అదృష్టం ఉండేలా చెయ్యి దేముడా, అనుకొని, మాదగ్గరకు వచ్చేశారు.

    ఆవిడలో 35 సంవత్సరాలూ, ఆవిడలోని మార్పులన్నీ చూశాను, 60-70 ల్లో కొత్తకోడలుగానూ,70-80 ల్లో ఇద్దరు పిల్లల తల్లిగానూ,80-90 ల్లో ఓ అత్తగారి గానూ నాకెన్నో అనుభవాలున్నాయి ఆవిడతో. ఏం చెప్పినా, ఆవిడ చివరి నాలుగు సంవత్సరాలకీ, మా దగ్గరకు వచ్చేసరికి,ఆవిడని చూసి జాలి పడాలో, లేక ఎప్పటికైనా మనమూ అలాగే ఉంటామేమో అనే భయమో ఏదో తెలియదు, బాధ్యత మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు.ఆవిడలో వచ్చిన మార్పు చూసి, ఎంతో నేర్చుకున్నాను, పరిస్థితులకి అనుగుణంగా ఎలా ఎడ్జస్ట్ అవాలో, ఎలా ఉంటే మనకి మనశ్శాంతి ఉంటుందో,అన్నీ ఆవిడను చూసే నేర్చుకున్నాను.

బాధ్యత నుంచే బంధం ఏర్పడుతుంది,బంధం నుంచే అనుబంధం ఏర్పడుతుంది. ఆవిడ పోయినప్పుడు, ఆవిడ మొహం మీది ప్రశాంతత చూసిన తరువాత, నేను తీసికున్న బాధ్యత సరీగ్గానే నిర్వర్తించాననే అనిపిస్తూంది. అందుకే ఇన్ని జ్ఞాపకాలు.

నాకూ ఓ గుర్తింపోటొచ్చేసింది!!


పైనిచ్చినది ఈవాళ్టి(27/06/10) ఈనాడు వసుంధర లో నాబ్లాగ్గుగురించి వచ్చినది. జ్యోతి గారు ప్రొద్దుటే ఫోను చేసి చెప్పారు. ఏదో నాకు తెలిసిన వంటకం గురించి వ్రాయడం,అది నచ్చడం,పైగా దానిగురించి పత్రికలో పడడం అబ్బో, చాలా సంతోషంగా ఉంది.సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జ్యొతి మాకు ఫోను చేసి చెప్పడం,తనబ్లాగ్గులో వ్రాయడం--అన్నీ ఈ ఆదివారం ఓ స్పెషల్ గా చేశాయి !

అదన్నమాట సంగతి!!

    ఏడాదినుండి బ్లాగ్గులు వ్రాస్తున్నాను. ఎంతండీ, మాశ్రీవారు ప్రారంభించిన పది పదిహేను రోజులకి మొదలెట్టాను.నాకేమైనా రిటైరుమెంటా,ఆయనలా రోజూ ఒక్కో బ్లాగ్గు పోస్ట్ చేయడానికీ, ఇల్లంతా తుడుచుకోవడం,తడిగుడ్డతో మళ్ళీ తుడవడం,వంటా వార్పూ,పూజా పునస్కారం ఎన్ని పనులు? ఆయన ఛాన్సు దొరికితే కంప్యూటరు ముందర సెటిల్ అయిపోవడం.ఇంక నాకెక్కడదీ ఛాన్సూ? ఏదో సంసారపక్షంగా ఉంటుందీ అని ఏవేవో వ్రాసేదాన్ని.జనసంచారం ఎక్కువ ఉన్నట్టు కనిపించలేదు, మా శ్రీవారి ఇంగ్లీషు బ్లాగ్గులా!

    ఓవైపు ఆయనేమో, రోజుకోబ్లాగ్గుచొప్పున వ్రాసుకుంటూ పోతున్నారు, పైగా 300 పైచిలుకి వ్రాసేనని ఓ గొప్పా!వ్రాసుకోవడం మానేసి,నాలా ఇంటిపనులు చూడమనండి,తెలుస్తుంది,ఎవరెక్కువ వ్రాయగలరో!వదిలేయండి ఆ గొడవ,ఇక్కడ ఎవరెక్కువ వ్రాశారూ అని కాదు,ఆయనదానికి అంత ట్రాఫిక్కు ఎందుకొస్తోందీ అని ఆలోచించా.ఆయనేమీ తెలియని విషయాలు వ్రాయడంలేదు,వ్రాసే భాషలో తేడా! పైగా ఈ విషయం ఆయనతో అన్నానంటే ఇంకా నెత్తికెక్కేస్తారు!పైగా ఛాన్సుదొరికితే తూ.గో.జి, ప.గొ.జీ అంటారు.అలాటివారినడిగి లాభంలేదు.మనమే ఏదో పరిష్కారం ఆలోచించాలి.

   ఎనాలిసిస్ మొదలెట్టాను.ఆయన వ్రాసే పధ్ధతి మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఉపయోగించే భాష ఉంటుంది.అంతకంటె ఎక్కువేం ఎక్స్ పెక్ట్ చేస్తాంలెండి... అయ్య నాశ్రీవారూ ఇదన్నమాట కిటుకు! పైగా ఈమధ్యన చాలా బ్లాగ్గుల్లో నామీద ఆడిపోసుకోవడంతోటే సరిపోతూంది. టిట్ ఫర్ టాట్, ఆమాత్రం నాకు వ్రాయడం రాదా అనుకుని రాణి రుద్రమదేవినీ, ఝాన్సీలక్ష్మీ బాయినీ గుర్తుచేసేసుకుని, ' భాగ్ ఫిరంగీ భాగ్ ఫిరంగీ...' అనుకుంటూ మొదలెట్టేశాను.

    కానీ ఇలా వ్రాయడం మొదలెట్టిన తరువాత అనుకున్నాను- ఈ వయస్సులో పాపం ఆయన్ని కష్టపెట్టడం ఎందుకూ అని, అయినా ఆయనెక్కడికి వెళ్తారు-మామిడికాయ పప్పూ, కందా బచ్చలి కూర,ఆవపెట్టి కూరలూ చేసి ఈయన వేవిళ్ళకోరికలెవరు తీరుస్తారులెండి? ఈవేళ్టికీవేళ, మామిడికాయపప్పూ, చామదుంప (ఉప్మా) కూర చేస్తే ఆవురావురుమంటూ తిన్నారు!

    అయినా చదివేవాళ్ళున్నారనీ, వినేవాళ్ళున్నారనీ, మరీ పేట్రేగిపోతే ఎంతకాలం ఊరుకుంటాం చెప్పండి. ఎప్పుడూ ఆయనవ్రాసేవే చదివేసి, నన్నేదో రాక్షసనుకుంటారని,నేనూ ఉన్నదేదో వ్రాస్తున్నాను.
ఒక్కవిషయం గమనించాను-ఇలా పధ్ధతి మార్చేటప్పటికి, ఎప్పుడూ రాని వారు కూడా నా బ్లాగ్గులోకి వచ్చి 'ఇక్కడేదో గొడవ జరుగుతోందీ' అని పసికట్టేశారు! పైగా ఇప్పుడు పాత బ్లాగ్గులు చదువుతూంటే, ఛా ఇదేమిటీ మరీ చాదస్థంగా వ్రాశానూ అనిపిస్తోంది
An Idea changes life!!

పతియే పరమేశ్వరుడు, ఇల్లే వైకుంఠం
 
Copyright 2009 ఇదీ సంగతి All rights reserved.
Blogger Templates created by Deluxe Templates
Wordpress Theme by EZwpthemes